న్యూఢిల్లీ: దేశంలో ద్రవ్యోల్బణం వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) వడ్డీ రేట్ల పెంపు సైకిల్ను ప్రారంభించే అవకాశం ఉందని సిస్టమాటిక్స్ గ్రూప్ నివేదిక అంచనా వేసింది. అక్టోబర్ తొలి వారంలో జరగనున్న ద్రవ్య విధాన కమిటీ (ఎంపీసీ) సమావేశంలో దీనికి సంబంధించిన తొలి సంకేతాలు వెలువడే అవకాశం ఉందని పేర్కొంది.
ప్రస్తుతం 5.25 శాతంగా ఉన్న రెపో రేటు క్రమంగా 6.5 శాతానికి చేరే అవకాశం ఉందని నివేదిక అంచనా వేసింది. ద్రవ్యోల్బణం ఇదే స్థాయిలో కొనసాగితే వడ్డీ రేట్ల విషయంలో ఆర్బీఐ కఠిన వైఖరి అవలంబించే అవకాశం ఉందని తెలిపింది.
పెరిగిన రిటైల్ ద్రవ్యోల్బణం
ఆగస్టులో దేశ రిటైల్ ద్రవ్యోల్బణం 4.82 శాతానికి పెరిగింది. జులైలో ఇది 4.45 శాతంగా ఉండగా.. కొత్త సిరీస్లో ఇదే అత్యధిక స్థాయిగా నమోదైంది. వరుసగా మూడో నెలలోనూ ఆర్బీఐ నిర్దేశించిన 4 శాతం మధ్యస్థ లక్ష్యాన్ని ద్రవ్యోల్బణం అధిగమించింది.
ఆహార ధరల భారం
ఆహార ద్రవ్యోల్బణం కూడా ఆగస్టులో 5.95 శాతానికి చేరింది. జులైలో ఇది 5.52 శాతంగా ఉంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఆహార ధరల పెరుగుదల ఎక్కువగా నమోదైంది. అక్కడ ఆహార ద్రవ్యోల్బణం 6.13 శాతానికి చేరింది.
కూరగాయలు, సుగంధ ద్రవ్యాల ధరలు ప్రధానంగా ధరల పెరుగుదలకు కారణమవుతున్నాయని నివేదిక పేర్కొంది. ఇంధనం, ఇంధన ఆధారిత ఉత్పత్తుల ధరలు, తయారీ వ్యయాలు కూడా ద్రవ్యోల్బణంపై ఒత్తిడిని పెంచుతున్నాయని తెలిపింది.
హోల్సేల్ ద్రవ్యోల్బణం కూడా పైకి
హోల్సేల్ ధరల ద్రవ్యోల్బణం కూడా ఆగస్టులో 9.92 శాతానికి పెరిగింది. జులైలో ఇది 9.78 శాతంగా నమోదైంది. ధరల పెరుగుదల ఇదే వేగంతో కొనసాగితే అక్టోబర్-నవంబర్ నాటికి ద్రవ్యోల్బణం 6 శాతాన్ని దాటే అవకాశం ఉందని నివేదిక అంచనా వేసింది.
ఎల్నినో, ముడిచమురు ధరల ప్రభావం
ఎల్నినో ప్రభావంతో ఆహార సరఫరాపై ఒత్తిడి పెరగడం, అంతర్జాతీయ మార్కెట్లలో ముడిచమురు ధరలు పెరగడం వంటి అంశాలు భవిష్యత్తులో ద్రవ్యోల్బణానికి మరింత ముప్పుగా మారవచ్చని సిస్టమాటిక్స్ గ్రూప్ తెలిపింది.
ద్రవ్యోల్బణం అదుపులోకి రాకపోతే.. వడ్డీ రేట్ల పెంపు ద్వారా ధరల నియంత్రణకు ఆర్బీఐ చర్యలు తీసుకునే అవకాశం ఉందన్న చర్చకు ఈ నివేదిక మరింత బలం చేకూర్చింది.