విశాఖపట్నం: నగరంలోని రామ్నగర్లో ఓ మహిళ అపస్మారక స్థితిలో కనిపించిన ఘటనపై ఏసీపీ లక్ష్మణమూర్తి వివరాలు వెల్లడించారు. రామ్నగర్లో గంగా, చంద్రమ్మ అనే అక్కాచెల్లెళ్లు నివాసం ఉంటున్నారని తెలిపారు.
చంద్రమ్మను సాయి ప్రదీప్ అనే వ్యక్తి ప్రేమ పేరుతో వేధించేవాడని, ఆమె అతడి ప్రేమను నిరాకరించడంతో ఈ నెల 9వ తేదీన ఆమె ఇంట్లోకి ప్రవేశించినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం తాడుతో చంద్రమ్మ మెడకు చుట్టడంతో ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లినట్లు వెల్లడించారు.
చంద్రమ్మ అపస్మారక స్థితిలోకి వెళ్లిన విషయాన్ని గమనించిన సాయి ప్రదీప్ అక్కడి నుంచి పరారైనట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసినట్లు ఏసీపీ లక్ష్మణమూర్తి వెల్లడించారు. ప్రస్తుతం అతడిని విచారిస్తున్నామని, ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను దర్యాప్తులో వెల్లడిస్తామని తెలిపారు.