విశాఖపట్నం: విశాఖ నగరంలో కురుస్తున్న వర్షాలతో లోతట్టు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలీపురం, నాయుడుతోట ప్రాంతాల్లో భారీగా వర్షపు నీరు చేరడంతో పలు ప్రాంతాలు జలమయంగా మారాయి. రహదారులపై నీరు నిలిచిపోవడంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు.
మరోవైపు డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడంతో మురుగునీరు రోడ్లపైకి చేరుతోంది. వర్షపు నీటితో కలిసి మురుగునీరు నిలిచిపోవడంతో పరిసర ప్రాంతాల్లో దుర్వాసన వెదజల్లుతోంది. దీంతో స్థానికులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. ముఖ్యంగా ఇళ్ల నుంచి బయటకు రావాలన్నా, రాకపోకలు సాగించాలన్నా ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయి.
కొన్ని ప్రాంతాల్లో డ్రైనేజీలు పొంగిపొర్లుతుండటంతో మురుగునీరు రోడ్లపై ప్రవహిస్తోంది. దీంతో పారిశుధ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వర్షం కురిసిన ప్రతిసారీ ఇదే పరిస్థితి ఎదురవుతోందని, శాశ్వత పరిష్కారం చూపాలని అధికారులను ప్రజలు కోరుతున్నారు.
వర్షపు నీటిని, మురుగునీటిని వెంటనే తొలగించి రోడ్లను శుభ్రం చేయడంతో పాటు డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.