అమరావతి: ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగంలో సరికొత్త అధ్యాయానికి తెరలేవనుంది. రాష్ట్రంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలను జల మార్గాల ద్వారా అనుసంధానించే సీ ప్లేన్ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ప్రాజెక్టును పీపీపీ విధానంలో అమలు చేసేందుకు స్కైహోప్ ఏవియేషన్, మారిటైం ఎనర్జీ హెలి ఎయిర్ సర్వీసెస్ (మె హెయిర్) సంస్థలు ముందుకు వచ్చాయి. వాటి ప్రతిపాదనలకు కేంద్ర పౌరవిమానయాన మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది.
ఈ ప్రాజెక్టు కోసం రాష్ట్రవ్యాప్తంగా 10 ప్రాంతాలను గుర్తించారు. విజయవాడలోని బెర్మ్ పార్క్, శ్రీశైలం, విశాఖపట్నం, తిరుపతి రాయలచెరువు, సూర్యలంక, గండికోట, కాకినాడ, అరకు జోలాపుట్, లంబసింగి తాజంగి రిజర్వాయర్, పోలవరం ప్రాంతాల్లో సీ ప్లేన్ సేవలు అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది.
వాటర్డ్రోమ్ల నిర్మాణం
సీ ప్లేన్ల రాకపోకల కోసం ఎంపిక చేసిన ప్రాంతాల్లో వాటర్డ్రోమ్లు ఏర్పాటు చేయనున్నారు. ఇవి జల విమానాల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసే మినీ విమానాశ్రయాలుగా పనిచేయనున్నాయి. ఒక్కో వాటర్డ్రోమ్ నిర్మాణానికి సుమారు రూ.20 కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు.
వాటర్డ్రోమ్ల నిర్మాణానికి ఏపీ పర్యాటకాభివృద్ధి సంస్థ త్వరలో టెండర్లు పిలిచే అవకాశం ఉంది. ఆపరేటింగ్ సంస్థలు ముందుకు రావడంతో నిర్మాణ పనులను వేగవంతం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
త్వరలో సంబంధిత సంస్థల ప్రతినిధులు ఎంపిక చేసిన ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించి భౌగోళిక పరిస్థితులు, నీటి లభ్యత, ప్రయాణికుల డిమాండ్ తదితర అంశాలపై సాధ్యాసాధ్యాలను పరిశీలించనున్నారు.
తొలి దశలో ఆరు ప్రాంతాల్లో సేవలు?
రాష్ట్రవ్యాప్తంగా గుర్తించిన 10 ప్రాంతాల్లో ఒకేసారి సీ ప్లేన్ సేవలను ప్రారంభించకుండా డిమాండ్కు అనుగుణంగా దశలవారీగా సేవలను అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది.
తొలి దశలో విజయవాడ, శ్రీశైలం, విశాఖపట్నం, లంబసింగి, సూర్యలంక, కాకినాడ ప్రాంతాల్లో సేవలు ప్రారంభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే ట్రయల్ రన్
గతేడాది విజయవాడలోని బెర్మ్ పార్క్ నుంచి శ్రీశైలం వరకు సీ ప్లేన్ ట్రయల్ రన్ నిర్వహించారు. ఆ సమయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వయంగా సీ ప్లేన్లో ప్రయాణించారు. అప్పట్లో నిర్వహించిన ప్రయోగం ఇప్పుడు పూర్తిస్థాయి ప్రాజెక్టుగా రూపుదిద్దుకోనుంది.
ఉడాన్ పథకం కింద కేంద్రం సహకారం
ఈ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం ఉడాన్ పథకం కింద ఆర్థిక సహకారం అందించనుంది. ప్రారంభ దశలో ప్రయాణికుల ఆదరణ తక్కువగా ఉండి ఆపరేటర్లకు నష్టాలు వస్తే, వాటిని భర్తీ చేసేందుకు వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ (VGF) ద్వారా సహాయం అందించే అవకాశం ఉంది.
దేశంలో ఇప్పటికే కేరళ, గుజరాత్ రాష్ట్రాల్లో ఉడాన్ పథకం కింద సీ ప్లేన్ సేవలు ప్రారంభమయ్యాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కూడా ఈ జాబితాలో చేరనుంది.
పర్యాటక రంగానికి కొత్త ఊపు
ఆంధ్రప్రదేశ్లోని ప్రకృతి అందాలు, సముద్ర తీర ప్రాంతాలు, కొండ ప్రాంతాలు, ఆధ్యాత్మిక క్షేత్రాలను వేగంగా అనుసంధానించేందుకు సీ ప్లేన్ సేవలు ఉపయోగపడతాయని అధికారులు భావిస్తున్నారు. పర్యాటకుల సంఖ్య పెరిగే కొద్దీ ఈ సేవలకు డిమాండ్ కూడా పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.
మరోవైపు, నిర్మించనున్న వాటర్డ్రోమ్లను కేవలం సీ ప్లేన్ల రాకపోకలకే పరిమితం చేయకుండా ఇతర పర్యాటక బోట్ల అవసరాలకు కూడా ఉపయోగపడేలా డిజైన్ చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది.
దీంతో సీ ప్లేన్ ప్రాజెక్టు కేవలం రవాణా సదుపాయంగా కాకుండా.. ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగానికి కొత్త ఆకర్షణగా మారే అవకాశం ఉంది.