అమలాపురం: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పర్యటించనున్నారు. పి.గన్నవరం నియోజకవర్గంలో సీఎం పర్యటన కొనసాగనుంది. పర్యటనలో భాగంగా రైతులతో నేరుగా సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకోనున్నారు. అలాగే రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలను స్వయంగా అందజేయనున్నారు.
సీఎం పర్యటన షెడ్యూల్ ప్రకారం.. ఉదయం 09:45 గంటలకు అమరావతి నుంచి బయలుదేరనున్న చంద్రబాబు, ఉదయం 10:30 గంటలకు అంబాజీపేట మండలం ఇరుసుమండ గ్రామానికి చేరుకుంటారు.
అక్కడి నుంచి 10:55 గంటలకు మాచవరం గ్రామానికి వెళ్లి రైతులతో సమావేశమవుతారు. ఈ సందర్భంగా రైతులతో ముఖాముఖిగా మాట్లాడి వారి సమస్యలు, ఇబ్బందులను తెలుసుకోనున్నారు. అనంతరం రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలను పంపిణీ చేస్తారు.
మధ్యాహ్నం 01:55 గంటలకు పండువారిపేటలో ఏర్పాటు చేసిన గ్రామసభలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. గ్రామసభలో ప్రజలను ఉద్దేశించి చంద్రబాబు ప్రసంగించనున్నారు.
అనంతరం సాయంత్రం 03:15 గంటలకు పి.గన్నవరం నియోజకవర్గంలోని టీడీపీ శ్రేణులతో ముఖ్యమంత్రి ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. పార్టీ పరిస్థితులు, స్థానిక అంశాలపై నేతలు, కార్యకర్తలతో చర్చించే అవకాశం ఉంది.
కార్యక్రమాలన్నీ ముగించుకున్న అనంతరం సాయంత్రం 05:40 గంటలకు చంద్రబాబు తిరిగి అమరావతికి బయలుదేరి వెళ్లనున్నారు.
ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సీఎం పర్యటన సజావుగా సాగేందుకు భద్రతా చర్యలు, ఇతర ఏర్పాట్లను అధికారులు పర్యవేక్షిస్తున్నారు.