అమరావతి: ప్రజల ఆశలు, అంచనాలకు అనుగుణంగా జిల్లా కలెక్టర్లు తమ ఆలోచనా విధానాన్ని మార్చుకోవాలని, న్యూ ఏజ్ లీడర్షిప్, న్యూ ఏజ్ గవర్నెన్స్ విధానాలను అలవర్చుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. పరిపాలనలో ఆధునిక సాంకేతికతను విస్తృతంగా వినియోగిస్తూ.. ప్రజలకు వేగంగా, కచ్చితమైన ఫలితాలు అందించడంపై అధికారులు దృష్టి పెట్టాలని స్పష్టం చేశారు.
అమరావతిలో గురువారం జరిగిన 8వ జిల్లా కలెక్టర్ల సదస్సులో ‘లీడర్షిప్ – న్యూ ఏజ్ గవర్నెన్స్’ అంశంపై సీఎం చంద్రబాబు అధికారులకు దిశానిర్దేశం చేశారు.
నాయకత్వమే కీలకం
గతంలో పరిపాలనకు సంబంధించిన అనేక అంశాలపై దృష్టి పెట్టామని, ప్రస్తుతం ప్రధానంగా నాయకత్వంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని చంద్రబాబు పేర్కొన్నారు. సరైన నాయకత్వంతోనే వేగంగా ఫలితాలు సాధించగలమని, తద్వారా స్వర్ణాంధ్ర విజన్ లక్ష్యాలను చేరుకోవచ్చని అన్నారు.
నాయకత్వం అనేది స్వీయ ప్రేరణతో రావాలని సూచించిన సీఎం.. నాయకత్వంలో మహిళలు, పురుషులు అనే భేదం చూడటం పాతకాలపు ఆలోచనా విధానమని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం రాష్ట్రంలో నాయకత్వ మార్పు దశ కొనసాగుతోందని, అధికారులు కూడా కొత్త తరహా నాయకత్వ పద్ధతులను అనుసరించాలని సూచించారు.
విశ్వసనీయతకు పెద్దపీట
మారుతున్న కాలానికి అనుగుణంగా ఉద్యోగ వ్యవస్థలు కూడా వేగంగా మారుతున్నాయని చంద్రబాబు అన్నారు. ఈ నేపథ్యంలో అధికారులు, రాజకీయ నాయకులకు విశ్వసనీయత అత్యంత కీలకమని పేర్కొన్నారు.
వృత్తిపరంగా ముందుకు వెళ్లాలంటే నైపుణ్యాలను నిరంతరం మెరుగుపరుచుకోవాలని సూచించారు. కొత్త విషయాలను నేర్చుకోవడం ఆపకూడదని, మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా అధికారులు తమ సామర్థ్యాలను పెంచుకోవాలని అన్నారు.
ఏఐతో వేగవంతమైన పరిపాలన
పరిపాలనలో టెక్నాలజీ వినియోగంపై సీఎం ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ఆన్లైన్లో ఫైళ్ల నిర్వహణ, అవేర్, డేటా లేక్ వంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని అధికారులు సమర్థవంతంగా ఉపయోగించుకోవాలని సూచించారు.
ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాయంతో డేటాను విశ్లేషించుకుని నిర్ణయాలు తీసుకోవాలని చెప్పారు. తద్వారా పొరపాట్లకు అవకాశం తగ్గించి, ప్రజలకు మరింత కచ్చితమైన ఫలితాలను అందించవచ్చని చంద్రబాబు పేర్కొన్నారు.
భారతీయుల ప్రతిభను స్ఫూర్తిగా తీసుకోవాలి
ప్రపంచవ్యాప్తంగా భారతీయ పారిశ్రామికవేత్తలు అత్యుత్తమంగా రాణిస్తున్నారని చంద్రబాబు అన్నారు. ఏ వ్యవస్థలోనైనా ఇమిడిపోయి, పరిస్థితులకు అనుగుణంగా పనిచేసే సామర్థ్యం భారతీయుల సొంతమని పేర్కొన్నారు.
అదే స్ఫూర్తితో అధికారులు కూడా మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా తమను తాము మార్చుకుని, ప్రజలకు మెరుగైన పాలన అందించాలని సీఎం ఆకాంక్షించారు.