గర్భిణీ స్త్రీలకు ఫ్రెండ్స్ ట్రస్ట్ పౌష్టికాహారం
తలుపుల పీహెచ్సీలో 100 మందికి పౌష్టికాహారం పంపిణీ
తలుపుల, సెప్టెంబర్ 10: తలుపుల మండల కేంద్రంలోని స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఫ్రెండ్స్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారం అందించారు. ఫ్రెండ్స్ ట్రస్ట్ ప్రతి నెలా నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాల్లో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.
ఈ కార్యక్రమానికి తలుపుల ఎంపియుపి పాఠశాల ప్రధానోపాధ్యాయులు వీర రాఘవ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి వచ్చే గర్భిణీ స్త్రీలకు మధ్యాహ్న సమయంలో పౌష్టికాహారం అందించడం అభినందనీయమన్నారు. ఫ్రెండ్స్ ట్రస్ట్ చేపడుతున్న సేవా కార్యక్రమం ఎంతో గొప్పదని ప్రశంసించారు.
సమాజంలో అవసరమైన వారికి అండగా నిలుస్తూ ఇలాంటి సేవా కార్యక్రమాలను నిర్వహించడం అభినందనీయమని వీర రాఘవ రెడ్డి అన్నారు. ఇటువంటి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం లభించడం తన అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు.
అనంతరం ముఖ్య అతిథి వీర రాఘవ రెడ్డికి ఫ్రెండ్స్ ట్రస్ట్ ఫౌండర్ మన్సూర్ తరఫున దేవుని ప్రతిమ చిత్రపటాన్ని అందజేశారు.
ఈ కార్యక్రమంలో గర్భిణీ స్త్రీలు, వైద్య సిబ్బంది కలిపి సుమారు 100 మందికి పౌష్టికాహారం అందించారు. కార్యక్రమంలో డాక్టర్ ఆశ్రిత, హోమియోపతి డాక్టర్ లక్ష్మీనరసయ్య, వైద్య సిబ్బంది, ఫ్రెండ్స్ ట్రస్ట్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.