కాకినాడ: వినాయక చవితి పర్వదినాన కాకినాడ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. పిఠాపురం మండలం కందరాడ గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు సోమవారం ఉదయం పాదగయ క్షేత్రానికి దర్శనం కోసం వెళ్లారు.
దర్శనానికి ముందు పాదగయలోని పుష్కరిణిలో స్నానం చేసేందుకు ముగ్గురూ నీటిలోకి దిగారు. ఈ సమయంలో సాయి అనే 22 ఏళ్ల యువకుడు నీటిలో గల్లంతయ్యాడు. స్నానం చేస్తుండగా జారి నీటిలో మునిగిపోయినట్లు సమాచారం.
యువకుడు గల్లంతైన విషయం తెలుసుకున్న స్థానికులు అధికారులకు సమాచారం అందించారు. దీంతో అధికారులు రంగంలోకి దిగి గజ ఈతగాళ్లను రంగంలోకి దించారు. గల్లంతైన యువకుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
వినాయక చవితి సందర్భంగా పాదగయకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకోవడం విషాదాన్ని నింపింది.
ఈ ఘటనపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేసి బాధిత కుటుంబానికి సానుభూతి తెలిపారు.
పుష్కరిణులు, చెరువులు, నదులు, సముద్ర ప్రాంతాల్లో పండుగల సమయంలో భక్తులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. నీటి లోతు తెలియని ప్రాంతాల్లోకి వెళ్లకపోవడం, చిన్నపిల్లలను ఒంటరిగా నీటిలోకి వెళ్లనివ్వకపోవడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.