చలనచిత్ర పరిశ్రమకు 2026 సెకండాఫ్ సరికొత్త ఊపునిచ్చింది. కథలో కొత్తదనం, బలం ఉంటే ప్రేక్షకులు థియేటర్లకు పోటెత్తుతారని తాజా విజయాలు నిరూపిస్తున్నాయి. ‘పెద్ది’ మొదలుకొని ‘మా ఇంటి బంగారం’, ‘లెనిన్’, ‘చెన్నై లవ్ స్టోరీ’, ‘కొరియన్ కనకరాజు’, ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ల మీదుగా తాజా చిత్రం ‘ఇరుముడి’ వరకు వరుస హిట్లు టాలీవుడ్ను విజయపథంలో నడిపిస్తున్నాయి. స్టార్ ఇమేజ్తో పనిలేకుండా చిన్న, మిడ్-రేంజ్ సినిమాలకు సైతం బుక్మైషోలో భారీగా అడ్వాన్స్ బుకింగ్స్, హౌస్ఫుల్ షోలు నమోదు కావడం ఇండస్ట్రీకి శుభపరిణామంగా చెప్పొచ్చు. ఈ జోరు చూస్తుంటే 2026 టాలీవుడ్కు చిరస్మరణీయ బ్లాక్బస్టర్ సంవత్సరంగా నిలవడం ఖాయంగా కనిపిస్తోంది.
‘ప్రేక్షకులు ఓటీటీ కంటెంట్కు అలవాటు పడి థియేటర్లకు రావడం మానేశారు’.. ఇదీ కొంతకాలంగా సినీ వర్గాలు చెబుతున్నా మాట. దానికి తగినట్లే 2026లో సంక్రాంతి సీజన్ తర్వాత చాలాకాలం పాటు సినిమాలు పెద్దగా ఆడలేదు. అయితే మంచి కంటెంట్ అందిస్తే థియేటర్లకు వచ్చేందుకు తామెప్పుడూ సిద్ధంగానే ఉంటామని ప్రేక్షకులు మరోసారి నిరూపించారు. ఇదే విషయాన్ని 2026 సెకండాఫ్ స్పష్టంగా చెబుతోంది. ‘ప్రేక్షకులు థియేటర్లకు రావడం తగ్గించేశారు, ఓటీటీల వల్లే థియేటర్ల వ్యవస్థ దెబ్బతింటోంది’ అన్న వాదనలకు టాలీవుడ్ బాక్సాఫీస్ గట్టి సమాధానం చెబుతోంది. కథలో బలం, చెప్పే విధానంలో కొత్తదనం ఉంటే చాలు... ప్రేక్షకులు థియేటర్లను బ్రహ్మరథం పడతారని తాజా పరిణామాలు నిరూపిస్తున్నాయి. గత రెండు నెలలుగా వరుస విజయాలతో సినిమా థియేటర్ల వద్ద పండుగ వాతావరణం నెలకొంది.