విశాఖపట్నం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆనందపురం-పెందుర్తి సర్వీస్ రోడ్డులో కారు లారీని ఢీకొట్టడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో కారులో ఉన్న డ్రైవర్ సజీవ దహనమయ్యారు.
గాండ్రిగుండం పరిధిలోని సత్తారువు జంక్షన్ వద్ద ఈ విషాద ఘటన చోటుచేసుకుంది.
జాతీయ రహదారి-16 సర్వీస్ రోడ్డుపై వేగంగా వెళ్తున్న కారు.. ముందుగా వెళ్తున్న లారీని బలంగా ఢీకొట్టినట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన వెంటనే కారు ఇంజిన్లో మంటలు చెలరేగాయి.
క్షణాల్లోనే మంటలు కారు మొత్తం వ్యాపించడంతో డ్రైవర్ బయటకు రాలేకపోయారు. వాహనంలోనే చిక్కుకుపోయిన ఆయన మంటల్లో కాలిపోయి ప్రాణాలు కోల్పోయారు.
సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే వారు అక్కడికి చేరుకునే సమయానికి కారు పూర్తిగా దగ్ధమైపోయింది.
ఆనందపురం ఎస్ఐ శివ ప్రమాద స్థలాన్ని పరిశీలించి వివరాలను సేకరించారు. ప్రమాద సమయంలో కారు నంబర్ ప్లేట్ ఊడిపోయి లారీకి అతుక్కుపోయినట్లు పోలీసులు గుర్తించారు.
ఆ నంబర్ ప్లేట్ ఆధారంగా మృతుడి వివరాలను గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.